Amanchi Joined Congress: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రకాశం జిల్లా చీరాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎలాగైనా చీరాల నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. అందుకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు?
చీరాల అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాజీ సీఎం రోశయ్య. ఆయన శిష్యుడిగా పేరు సంపాదించారు ఆమంచి కృష్ణమోహన్. అక్కడ బలమైన కేడర్ తయారు చేసుకున్న ఆయన, సొంతంగా పార్టీ పెట్టి మరీ గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి వెళ్లారు. గత ఎన్నికల ముందు సైకిల్ దిగేసి.. ఫ్యాన్ గూటికి చేరుకున్నారు. అయితే ఆయనకు చీరాలకు కాకుండా పర్చూరు ఇన్ఛార్జ్గా అప్పగించింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. కాకపోతే సమయం కోసం ఎదురు చూశారు ఆమంచి. ఈ క్రమంలో మళ్లీ చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. వైసీపీ నుంచి బరిలోకి దిగిన కరణం ఫ్యామిలీని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు ఆమంచి.
మంగళవారం చీరాల నియోజకవర్గం అభిమానులతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమ య్యారు. చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేశారు. దీనికితోడు సర్వే కూడా నిర్వహించుకున్నారు. ఆమంచికి పాజిటివ్గా ఉండడంతో వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్నారు. రేపోమాపో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నట్లు ప్రకటించారు.
Also Read: టీడీపీ విరాళాల వెబ్సైట్ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..!
చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కరణం బలరాం కొడుకు వెంకటేష్ బరిలో ఉన్నారు. టీడీపీ తరపున మాలకొండయ్య.. కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ ఖాయమని అంటున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 1983 నుంచి చీరాల టీడీపీకి కంచుకోట లాంటిది. తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం రెండుసార్లు, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలుపొందారు. దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఖాయమని అంటున్నారు.