Measles In Mumbai : ముంబయిలో మీజిల్స్ వ్యాధి పిల్లలకు ప్రాణాంతకంగా మారింది. ముఖ్యంగా మురికివాడల్లోని పిల్లలు మీజిల్స్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. సోమవారం నుంచి ఈ మీజిల్స్ వ్యాధి కేసులు ముంబైలో క్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముంబైలోని కన్తూర్బా ఆసుపత్రిలో ఈ మీజిల్స్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది మురికి వాడకు చెందిన చిన్నారులే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా వీరినుంచే అధికంగా ఉంది.
వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ముంబైలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ఐదుగురు చిన్నారులు మీజిల్స్ వ్యాధితో మృతి చెందారు. ముంబైలో బీఎంసీ వార్డుల్లో ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం.. తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి లొకేషన్లను హైరిస్క్ ఏరియాలుగా ప్రకటించారు.
మీజిల్స్ అంటువ్యాధని, మోరిబిలివైరస్ ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీజిల్స్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్లల్లో కళ్లు ఎర్రగా మారి కండ్లకలక రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. గర్భిణీలకు, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు ఈ వ్యాధి సంభవించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. మీజిల్స్ వ్యాధిని నివారించడానికి మీజిల్స్ వ్యాక్సిన్ కూడా ఉందని.. సరైన సమయంలో తప్పకుండా ఆ వ్యాక్సిన్ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీజిల్స్ ప్రాణాంతకమైంది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.