Mahalakshmi Scheme in Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారింది. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లో రూ. 1177 కోట్ల విలువ గల జీరో టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా తెలంగాణలో మహిళలు ఈ ఫథకం ద్వారా తెలంగాణ అంతటా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రారంభించింది.
ఈ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని అధికారులు తెలిపారు. ఆ తరువాత ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సగటున 29.67 లక్షల మహిళలు ప్రతీ రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక డిసెంబర్ నెలలో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఫ్రీ టికెట్ పై జర్నీ చేశారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు రూ. 1177 కోట్ల విలువ గల జీరో టికెట్లు జారీ చేసినట్లు ఆర్టీసీ పేర్కొంది. దీంతో ఈ పెద్ద మొత్తం తెలంగాణ మహిళలకు ఆదా అయినట్లేనని అధికారులు వెల్లడించారు.
Also Read: Mahalakshmi Scheme : అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్!
ఇక రాజధాని నగరంలో రోజుకు 6 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. గతంలో హైదరాబాద్లో సిటీ బస్ పాస్లు, బస్ టికెట్ల కోసం ప్రతి మహిళ నెలకు రూ. 1500 వరకు ఖర్చు చేసేవారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా అంత మేరకు తెలంగాణ మహిళలు నిధులను ఆదా చేస్తున్నారు.