Yash Thakur Creates History in IPL 2024: ఐపీఎల్ లో మళ్లీ పెను సంచలనం.. 5 వికెట్లతో ఇరగదీసి లఖ్ నవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ ఠాకూర్ ఎవరు..? అని నెట్టింట పెద్ద చర్చే మొదలైంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట లఖ్ నవ్ 163 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందని అనుకున్న గుజరాత్ టైటాన్స్ అతి దారుణంగా 130 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీనికి ప్రధాన కారణం ఒకరున్నారు. అతనే లఖ్ నవ్ బౌలర్ మీడియం పేసర్ యశ్ ఠాకూర్. 25 ఏళ్ల యశ్ కోల్ కతాలో జన్మించాడు. ప్రస్తుతం దేశీయ జట్టు విదర్భ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ కి వచ్చేసరికి లఖ్ నవ్ టీమ్ లో ఆడి, నేటి మ్యాచ్ ద్వారా గేమ్ ఛేంజర్ గా మారాడు. అంతేకాదు రికార్డులు ఒడిసిపట్టుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ వేసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఐపీఎల్ సీజన్ 2024లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ ఐదు వికెట్లు తీయడం ఆనందంగా ఉందని అన్నాడు. ఎన్ని వికెట్లు తీసినా శుభ్ మన్ గిల్ వికెట్ తీయడం మాత్రం గుర్తుండిపోతుందని అన్నాడు. తను గొప్ప బ్యాటర్. అతని వికెట్ తీయడానికి ఎన్నో ప్రణాళికలు వేశాను. అందులో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పిన కొన్ని సూచనలు పాటించాను. అదే పనిగా అదే బాల్స్ వేయడంతో గిల్ అవుట్ అయ్యాడని పేర్కొన్నాడు.
Also Read: 150 వికెట్ల క్లబ్ లో.. యార్కర్ స్టార్ జస్ప్రీత్ బూమ్రా
ఈ మ్యాచ్ లో మయాంక్ ఆడలేదు. అయితే తనెందుకు ఆడలేదనేది నాకింకా తెలీదు. తన ప్లేస్ ని రీప్లేస్ చేయాలని మాత్రం అనుకున్నాను. అలాగే జరిగింది. అంతేకాదు ఐపీఎల్ లో తొలిసారి గుజరాత్ పై విజయం సాధించడం ఆనందంగా ఉందని యశ్ అన్నాడు.
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో లఖ్ నవ్ ప్రధాన బౌలర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్ కెరీర్ లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి కృనాల్, యశ్ ఠాకూర్ ఇద్దరూ కలిసి లఖ్ నవ్ ని గెలిపించారు.