Pawan Kalyan: తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేదని.. కానీ తనకి పదవులు అవసరం లేదన్నారు. అనకాపల్లి కోడి గుడ్డు ఇప్పటి వరకు ఒక్క కిలోమీటరు కూడా రోడ్డు వేయించలేకపోయిందని జనసేనాని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జనసేనాని సెటైర్లు వేశారు. అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తుకు వస్తుంది కానీ.. ఇప్పుడు అనకాపల్లి అంటే కోడి గుడ్డు పేరు వింటున్నామని ఎద్దేవా చేశారు. కోడి గుడ్డు పెట్టింది.. ఇంకా పొదుగుతూనే ఉందన్నారు. వైసీపీ కోడి.. ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్ ను ఇచ్చిందికానీ.. ఒక్క కిలోమీటరుకు కూడా రోడ్డు వేయలేకపోయిందని ఆరోపించారు.
జగన్ ఓ సీఎం కాదని.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన ఒక్కడి ప్రయోజనాలు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, మంత్రి పదవులు కూడా తనకి అవసరం లేదని వెల్లడించారు. మంత్రి పదవులు కోరుకుంటే తనకి ఎప్పుడో వచ్చేవని.. రాష్ట్ర భవిష్యత్ మాత్రమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read: అభివృద్ధికి ఓటేస్తారో?.. విధ్వంసానికి వేస్తారో..? ప్రజలే ఆలోచించుకోవాలి: చంద్రబాబు
జనసేన పార్టీ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా సరే దశాబ్దకాలం పాటు పార్టీని నడిపించుకుంటా వచ్చానని.. అది మాటలు కాదని తెలియజేశారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే తాను పనిచేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా సరే తనకి విశేష ప్రజాభిమానం ఉందన్నారు. ఇంతటి ప్రజాభిమాన్ని తన పార్టీ కోసం కాదని.. ప్రజల కోసం ముందుకు వచ్చానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడాలంటే ఒక్క తప్పుకూడా జరగకూడదని.. అన్ని శక్తులు కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.