Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత అధికార ప్రభుత్వమైన వైసీపీ రోడ్డపై అయిన గుంతలే పూడ్చలేదు కానీ.. 3 రాజధానులు నిర్మిస్తుందా అని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ వేస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పాముర్రులో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం బహిరంగ సభలో మాజీ సీఎం చంద్రబాబు జగన్ పై మండిపడ్డారు. అమరావతి రాజధాని అయి ఉంటే కృష్ణా జిల్లాలోని భూములకు విలువ పెరిగేదని చంద్రబాబు అన్నారు. రోడ్ల మీద గుంతలనే పూడ్చలేని జగన్.. 3 రాజధానులు కడతారంట అని విమర్శించారు.
జగన్ హయాంలో ఎవరికైనా జాబ్ వచ్చిందా అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల హామీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లేదని, డీఎస్సీ లేదని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. జాబ్ కావాలంటే బాబు రావాలని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరం పూర్తి చేయడమే తన చిరకాల కోరిక అని చంద్రబాబు వెల్లడించారు.
ఎంతో మంది మహానీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అని.. అలాంటి జిల్లాలో తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు తయారయ్యారని వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. బూతులు మాట్లాడే వారికి జగన్ మంత్రి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ కు డబ్బు తప్ప మరేం వద్దని అన్నారు. తనకు మాత్రం మంచి నేతలు కావాలని.. అభివృద్ధికి ఓటేస్తారా.. లేక విధ్వంసానికి వేస్తారో ప్రజలే ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు.