Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తనకు కేటాయించిన వాహనంలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
తనకు కేటాయించిన వాహనం మొరాయించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి లేదా? అని ప్రశ్నించారు. లేకపోతే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడంతో చాలారోజులు జైలులో ఉన్నారు. ఇటీవలే కోర్టు ఆదేశాలతో రాజాసింగ్ విడుదలయ్యారు. ఆయన భద్రత కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనం తరచూ మొరాయించడంపై రాజాసింగ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనకు మరో వాహనాన్ని కేటాయించాలని ఇంటెలిజెన్స్ ఐజీని కోరారు.
తనకు కేటాయించిన 2010 మోడల్ వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానని రాజాసింగ్ అన్నారు. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని తెలిపారు. ఆ జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసని అయినా భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు తనపై దాడి చేసేలా అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. తనకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోవాలి రాజాసింగ్ కోరారు. పాత వాహనాన్ని వినియోగించలేనని లేఖలో స్పష్టం చేశారు.