BJP Demands CBI Inquiry On Phone Tapping: సిట్తో న్యాయం జరగదు.. సీన్లోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వాల్సిందే.. పాత్రధారులు దొరికారు. కానీ సూత్రదారుల సంగతేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చేస్తున్న డిమాండ్ ఇది. ఇంతకీ బీజేపీ సీబీఐ రాగం వెనక అసలు కథేంటి? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కమళనాథులు ఇప్పుడెందుకు ఫిర్యాదులు చేస్తున్నారు..? కేంద్రం ఇన్వాల్వ్ కావాల్సిందే. సీబీఐ విచారణ చేయాల్సిందే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్ ఇది. ప్రస్తుతం పాత్రధారులపై మాత్రమే విచారణ జరుగుతోందని.. సూత్రధారుల జోలికి వెళ్లడం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. వెంటనే ఈ అంశంపై ఫోకస్ చేయాలంటూ ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
అయితే ఇక్కడ కొన్ని అంశాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందానికి వచ్చాయంటున్నారు.. దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారన్నది ఇప్పుడు మెయిన్ టాపిక్. నిజానికి అదే నిజమైతే అసలు కేసులు ఎందుకు నమోదు చేస్తారు? అనేది ప్రధాన ప్రశ్న. విచారణను ఇంత దూరం తీసుకొచ్చి.. ఒక్కొక్క పాత్రధారిని పట్టుకొని ప్రశ్నించి.. వారి నోటి నుంచి సూత్రధారుల పేర్లు చెప్పిస్తూ.. ఇప్పుడు ఏకంగా SIB చీఫ్ ప్రభాకర్రావు వరకు వచ్చేశారు. ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న రాధాకిషన్రావు అయితే ఏకంగా బీఆర్ఎస్ సుప్రీమో అంటూ.. చెప్పకనే గులాబీ బాస్ పేరు చెప్పేశారు. ఈ విషయాలన్ని ప్రజలకు తెలిసినవే.. మరి ఇందులో లోపాయికారి ఒప్పందం ఏంటన్నది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి.
Also Read: లైట్స్.. కెమెరా..యాక్షన్..
మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల నాటకంలోనూ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించారు. ఇవీ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు.. నిజమే ఈ అనుమానాలు ఇప్పుడు ప్రజల్లోనూ మొదలయ్యాయి. నిజానికి ఈ కేసును ప్రస్తుతం పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.. ప్రణీత్ రావు తీగ లాగితే.. మొత్తం పోలీస్ వ్యవస్థలోని డొంకంతా కదిలింది.. ఇప్పుడిప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి SIB చీఫ్ ప్రభాకర్రావు ఫ్లైట్ నేడో రేపో హైదరాబాద్లో ల్యాండయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా దర్యాప్తులో నోరు విప్పితే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రావడం ఖాయం.. ఇలాంటి సమయంలో కేసు సీబీఐకి అప్పగించాలంటున్నారు బీజేపీ నేతలు.
ఎందుకు? దీని వెనక వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేసు సీబీఐ హ్యాండోవర్లోకి వెళితే ఏమవుతోంది? పగ్గాలు మొత్తం కేంద్రం హ్యాండోవర్లోకి వెళతాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి ఉంటుంది. కథ మళ్లీ మొదటి నుంచి మొదలవుతోంది. ప్రస్తుతం దర్యాప్తు తీరును చూస్తుంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇరుక్కోవడం ఖాయం. వారు ఎవరు? ఏఏ స్థాయిలో ఉన్న నేతల మెడకు చుట్టుకోనుంది? అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ.. సీబీఐ మళ్లీ కన్క్లూజన్కు వచ్చేందుకు పుణ్యం కాలం కాస్త గడిచిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఐదేళ్లుగా దర్యాప్తు కొనసాగుతూనే.. ఉంది. తెలంగాణలోనూ ఇదే సిట్యూవేషన్ వచ్చే చాన్స్ కూడా లేకపోలేదు.
అసలు ఏ రకంగా చూసినా ఈ కేసు బీజేపీ కంటే కాంగ్రెస్కే అవసరం.. ట్యాపింగ్ బాధితుల్లో మెజార్టీ కాంగ్రెస్ నేతలే.. ఇబ్బంది పడ్డది కూడా ఆ పార్టీ వారే.. సో దోషులను పట్టుకోవాలి.. వారికి చట్ట ప్రకారం శిక్షలు విధించాలన్న కసి ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కేసు అయితే నీరుగార్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు దోషులనుకున్నవారిని వదిలేసే చాన్స్ కనిపించడం లేదు. మరి ఎందుకు సీబీఐ విచారణ అన్న దానికి వేరే కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. పగ్గాలు రాష్ట్ర పెద్దల నుంచి కేంద్ర పెద్దల వద్దకు వెళ్లాలన్నదే బీజేపీ ప్లాన్లా కనిపిస్తోంది. అలా జరిగితే పరిస్థితులు తమ కంట్రోల్లో ఉంటాయనే భావనలో కమలనాథులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి పరిస్థితులు.