Wipro CEO step down:విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన స్థానంలో విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయిన వి ప్రోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం మేనేజింగ్, సీఈఓగా ఉన్న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఏప్రిల్ 6వ తేదీ నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని విప్రో బోర్టు పేర్కొంది. ప్రస్తుతం తనకున్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా డెలాపోర్టే తన పదవి నుంచి వైదొలిగారని, మే 31 నుంచి కంపెనీ నుంచి ఆయన పూర్తిగా తప్పుకుంటారని యాజమాన్యం ప్రకటించింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి శ్రీనివాస్ పల్లియా నియామకం అమల్లోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.
Also Read: మీ షోకు పోటీ ఇస్తున్న అమెజాన్.. లైవ్లోకి ‘బజార్’.. అతి తక్కువ ధరకే అన్ని రకాల వస్తువులు
డెలాపోర్టే 2020లో విప్రో సీఈఓగా నియమితులయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు డెలాపోర్టే సీఈఓగా, ఎండీగా సేవలందించారు. అయితే శనివారం తన పదవికి రాజీనామా చేసిన ఆయన విప్రోలో తన వంతు పాత్ర పోషించడాన్ని తనకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కొత్త సీఈఓగా నియమితులైన శ్రీనివాస్ పల్లియా మూడు దశాబ్దాలుగా విప్రోలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విప్రో కన్జ్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గా, అమెరికాస్-1 సీఈఓగా పనిచేస్తున్నారు.