Rahul Gandhi In Tukkuguda Congress Meeting: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ను ఓడించామని.. దేశంలో ఏ టీమ్ వంతు మిగిలిందని రాహుల్ గాంధీ అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ప్రసంగించిన ఆయన కేసీఆర్, బీజేపీ, నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు తెలుసున్నారు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చారు. గ్యారంటీ పత్రం ప్రజల హృదయాల నుంచి పుట్టిందన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయని తెలిపారు.
యువతకు ఏడాదికి రూ. లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళా న్యాయ్ ద్వారా ప్రతి ఏటా మహిళలకు రూ. లక్ష ఇస్తామని హామి ఇచ్చారు. దీంతో దేశంలో ఏ కుటుంబ ఆదాయం రూ. లక్ష కంటే తక్కువ ఉండదని తెలిపారు. విద్యావంతులైన యువతకు నెలకు రూ. 8500లతో పాటు సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామన్నారు.
ఎమ్ఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించి పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని రూ. 400కు పెంచుతామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాన్ని పెంచుతామన్నారు.
దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చపడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆర్థిక సర్వే., సంస్థాగత సర్వే చేపడతామని తెలిపారు. ఈ సర్వేలతో దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుందని పేర్కొన్నారు. ఇక బీజేపీ ఈడీ వసూళ్ల సంస్థగా మారిందని అన్నారు.