Tukkuguda Congress Meeting(Today’s state News): తుక్కుగూడ మరో సభకు వేదికైంది. అదే కాంగ్రెస్.. అదే ప్లేస్.. కానీ ఎన్నికలు మాత్రమే డిఫరెంట్. అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి తుక్కుగూడ అచ్చొచ్చిందని జాతీయ నాయకులకు కూడా అర్ధమైంది కావచ్చు. అందుకే కాంగ్రెస్ జనజాతర పేరుతో మరో సభను తుక్కుగూడలోనే ఏర్పాటు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీన్ను మళ్లీ రిపీట్ చేయాలని అనుకుంటుంది.
ఈ సభతోనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడిందని అంటుంటారు. కేవలం 39 సీట్లకే పరిమతమవ్వడం.. ఆ తరువాత ఒక్కొక్కరిగా పార్టీని వీడి హస్తం గూటికి చేరుకోవడం అన్ని చకాచకా జరిగిపోతున్నాయి. తుక్కుగూడ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిఇస్తే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తుక్కుతుక్కు చేశాయని చెప్పొచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలోనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఈ ఆరు గ్యారంటీలే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయుధాలుగా మారి తెలంగాణలో కాంగ్రెస్ శకానికి నాంది పలికాయి. కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హాజరయ్యారు. సోనియా గాంధీ స్వయంగా గ్యారంటీలను ప్రకటించారు. ఈ సభ తెలంగాణ దశ దిశను మార్చేసింది. ఈ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసింది కాంగ్రెస్.
నాటి అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తుక్కుగూడ సభ.. నేటి లోక్సభ ఎన్నికల సమరశంఖానికి నాంది పలకనుంది. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ పేరుతో తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తుక్కుగూడ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను నిలబెడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.