Sri Simha Koduri: గత కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన శ్రీ సింహ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. గతేడాది భాగ్ సాలే , ఉస్తాద్ అనే సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చినా.. అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి.
ఇక ఈ నేపథ్యంలోనే శ్రీ సింహ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. నటుడు, రాజకీయ నాయకుడు అయిన మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీ సింహ పెళ్లి జరగబోతుందని వార్తలు గుప్పుమన్నాయి. మురళీమోహన్ కు ఒక కొడుకు, ఒక కూతురు ఉండగా.. కూతురు విదేశాల్లో సెటిల్ అవ్వగా కొడుకు రామ్మోహన్ మురళీమోహన్ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. అతని భార్య మాగంటి రూప రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వారి కూతురే రాగ. విదేశాల్లో ఐఎస్ బి లో మాస్టర్స్ పూర్తి చేసి ఇండియాకు వచ్చిన రాగ.. తండ్రి వ్యాపారాలను చూసుకుంటుంది.
ఇక కొన్ని రోజులుగా శ్రీసింహ- రాగ పెళ్లి జరగనుందని, అది పెద్దల కుదిర్చిన వివాహమే అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల రాగ తల్లి మాగంటి రూప ఈ వార్తలకు స్పందించింది. కీరవాణి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరగడం నిజమే అని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలిపింది. ఈ ఏడాది చివర్లో వారి పెళ్లి ఉండబోతుందని ఆమె ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టెంట వైరల్ గా మారింది. అయితే శ్రీ సింహ కన్నా పెద్దవాడు కాలభైరవ పెళ్లి చేసుకోకుండా సడెన్ గా శ్రీ సింహకు పెళ్లి చేయడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయమై కీరవాణి ఎలా స్పందిస్తాడో చూడాలి.