Secundrabad Cantonment Congress Candidate(Political news in telangana): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. శ్రీనారాయణన్ శ్రీ గణేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అభ్యర్థిగా ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె పోటీ చేయగా.. ఈసారి శ్రీ గణేష్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది అధిష్టానం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ కూడా ప్రకటించింది.
Also Read : నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ..
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడం, ఆ తర్వాత లారీ దానిని కొంతదూరం మేర ఈడ్చుకెళ్లడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో కారులో పీఏ ఆకాశ్, కారు డ్రైవర్ కూడా ఉండగా.. వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. లాస్యనందిత కారు ప్రమాదం అప్పట్లో సంచలనం రేపింది. ఆమె మరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. అంతకుముందు నల్గొండ వద్ద కూడా ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డారామె. ఆ తర్వాత జరిగిన ఓఆర్ఆర్ ప్రమాదంలో మాత్రం మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు.