Earthquake: ప్రపంచ దేశాలు ప్రస్తుతం భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. కాశ్మీర్ నుంచి మొదలుకుని కాలిఫోర్నియా వరకు కేవలం 12 గంటల్లోనే భూకంపాలు సంభవించడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ప్రపంచ దేశాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ భూకంపాలు సంభవించాయి. గురు, శుక్రవారాల్లో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది.
రాజస్థాన్..
రాజస్థాన్లో శుక్రవారం మధ్యాహ్నం 1.29 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అయితే అర్థరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోను గురువారం రాత్రి భూకంపం సంభవించింది.
న్యూయార్క్, న్యూజెర్సీ..
న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో భూకంపాలు సంభవించాయి. న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0గా నమోదనట్లు భూకంప కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లోను భూమి కంపించిందని.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
ఉత్తర కాలిఫోర్నియా
ఉత్తర కాలిఫోర్నియాలో శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4. 4 తీవ్రతతో సంభవించినట్లు భూకంప కేంద్రం ప్రకటించింది. దాదాపు 7 సార్లు వేర్వేరు సమయాల్లో భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మయన్మార్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.