Power of PMLA(Today latest news telugu) : సింపుల్గా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావొచ్చు.. కవిత కావొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వారందరూ.. మొదట ఈ యాక్ట్ కింద నోటీసులు అందుకున్నవారే.. విచారణకు హాజరైన వారే. ఇంతకీ PMLA అంటే ఏంటి? ఆ చట్టం నిజంగా అంత పవర్ఫులా?
PML యాక్ట్.. యూపీఏ సర్కార్ తీసుకొచ్చిన ఈ చట్టం చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఈ చట్టాన్ని ఉపయోగించి నోటీసు జారీ అయ్యిందంటే.. ఇక మనం చేసేది ఏమీ లేదు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం తప్ప. నోటీసులు ఇచ్చే అధికారం లేదని ఎదురు ప్రశ్నించలేం. ఏదేనీ ఆర్థిక నేరంలో ఇన్వాల్వ్మెంట్ ఉందనే అనుమానంతో కానీ.. సాక్ష్యాధారాలు ఉన్నాయని కానీ ఈడీ అధికారులు భావించినపుడు.. విచారణకు పిలుస్తూ ఈడీ సమన్లు పంపించవచ్చు. కేసుకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సరెండర్ చేయాలని కోరవచ్చు. ఇలా నోటీసులు అందుకున్న వ్యక్తికి అందులోని సూచనలు ఫాలో కావడం మినహా.. మరో మార్గం లేదని PML చట్టం సెక్షన్ 50 (3) చెబుతోంది. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లలో చెప్పారో.. రానని చెప్పడానికి.. లాయర్లను పంపడానికి ఆప్షన్ అనేదే ఉండదు. చచ్చినట్టు ఇండివ్యూజల్గా హాజరవ్వాల్సిందే.
అసలు ఈ PMLA చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది..? దాని చరిత్ర ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే చాలా వెనక్కి వెళ్లాల్సిందే. 1988లో యూనైటెడ్ నేషన్స్ ఓ విషయాన్ని గుర్తించింది. డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ అలా సంపాదించిన అక్రమ సంపదనంతా.. వివిధ దేవాల ఆర్థిక వ్యవస్థల్లోకి చొప్పిస్తున్నారని.. వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఈ టాపిక్పై డిస్కస్ చేసింది. ఆ తర్వాత 1989 జూలైలో 7 అతిపెద్ద దేశాలు పారిస్లో అసెంబులై.. ఇదే టాపిక్పై డిస్కస్ చేశాయి. అప్పుడే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాయి. కానీ 1990లో అన్ని సభ్య దేశాలు డ్రగ్స్, నగదు అక్రమ చలామణిని నిరోధించే చట్టాలు చేయాలంది. అప్పుడు స్టార్టయ్యాయి.. అన్ని దేశాల్లో PML యాక్ట్ లు. కానీ ఇంప్లిమెంట్ కాలేదు.. 1998లోనూ ఇదే సూచన చేసింది. దీంతో 2002లో వాజ్పేయి సర్కార్ ఓ చట్టం తీసుకొచ్చింది. 2003లో దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడినా అమల్లోకి రాలేదు. కానీ యూపీఏ సర్కార్ 2005లో కొన్ని సవరణలు చేసి అమల్లోకి తీసుకొచ్చింది.
ఇది PMLA హిస్టరీ. నిజానికి PMLAకు సూపర్ పవర్స్ ఉన్నాయి. కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదనే చెప్పాలి. కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్లోనైనా రెయిడ్స్ చేయవచ్చు. అంతేకాదు CBI గానీ, ఇతర పోలీసులు డిపార్ట్ మెంట్స్ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. కానీ ఇండియన్ evidence ACT ప్రకారం ఆ స్టేట్ మెంట్స్లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే నిందితులు చెప్పిన స్టేట్ మెంట్ కు మళ్లీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి. కానీ ఈడీకి అలా కాదు. PMLA సెక్షన్ 50 అండర్2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఐన రికార్డు చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇస్తే.. మళ్లీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు.
PMLAకు ఉన్న మరో సూపర్ ఏంటంటే.. నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగానే ఉంటారు. కానీ ఈడీలో రివర్స్లో ఉంటుంది. మీరు నిర్దోషి అని నిరూపించుకునే బాధ్యత మీదే. అప్పటి వరకు మీరే దోషి. ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. అందుకే.. ఈడీ కేసులంటే నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటలు సైతం భయపడుతుంటారు.
డ్రగ్స్.. నగదు అ్రకమ రవాణా పాలిట సింహస్వప్నం PMLA. కానీ రాను రాను ఇది అధికార పార్టీ చేతుల కీలుబొమ్మగా మారి.. వారి రాజకీయ ప్రత్యర్థుల పాలిట శాపంగా మారిందన్న ప్రచారం మొదలైంది. ఎందుకంటే ఐపీసీలోని కొన్ని నేరాలను.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్లోని కొన్ని నేరాలను కూడా PMLA పరిధిలోకి తీసుకొచ్చారు. సో డబ్బు వ్యవహారం కనిపిస్తే.. ఈడీ ఎంటర్అయిపోతుంది. ఇంటర్నెషనల్ డ్రగ్స్ మాఫియాకు చెందిన నేరస్థుడిని ఎలాగైతే ట్రీట్ చేస్తుందో అలానే మాములు నేరస్థుడిని కూడా ట్రీట్ చేస్తుంది. 2019లో ఈ చట్టానికి చేసిన సవరణలతో మనీలాండరింగ్ నేరానికి పాల్పడేవారికి.. ఇతర షెడ్యూల్డ్ నేరాలు చేసినవారికి మధ్య తేడా లేకుండా పోయింది.
PML చట్టంలో సెక్షన్ 45 అనేది ఈ కేసుల్లో చిక్కుకున్న వారికి ఓ నైట్ మేర్. ఈ చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ దొరకడం దాదాపు అసాధ్యం. జడ్జి సాటిస్ఫై అయితేనే బెయిల్ వస్తుంది.. లేదంటే నో ఛాన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్, కవిత కేసులే. అందుకే PMLAకు సవరణలు చేయాలని చాలా రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.