Adilabad Tiger : ఆదిలాబాద్ జిల్లాలో పులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా పులుల సంచారం జరుగుతోంది. అంతేకాదు…పశువులతో పాటు మనుషులపై కూడా దాడి చేసింది. మంగళవారం ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడలో పులి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 20 సిబ్బందితో పులి ట్రాకింగ్ చేస్తున్నారు. 35 ట్రాప్ కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
పులి సంచారంతో కొన్నాళ్లుగా కొన్ని గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు ఏం జరుగుతోందన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పశువులను చంపి తిన్న పులి…తాజాగా ఓ మనిషిపై దాడి చేసింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. పులి బారి నుంచి తమను కాపాడాలంటూ అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. లేదంటే పులికి తాము ఆహారం అయిపోయే ప్రమాదముందని అంటున్నారు.