Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారు.
సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నానని విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. నారాయణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణ వయస్సు 65 ఏళ్లు దాటిందని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.