No Change in RBI Repo Rate: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆర్బీఐ రెపోరేటును ప్రకటించింది. అయితే ఈసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వరుసగా ఏడోసారి వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 6.5 శాతంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.
మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ రెపోరేట్లను ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతంగానే కొనసాగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రివర్స్ రెపోరేటు 3.5 శాతంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతంగానే ఉంది. వీటిలో ఎలాంటి మార్పులు చేయలేదు.
Also Read: భారత్లోని ఆ రాష్ట్రాల్లో టెస్లా తయారీ ప్లాంట్లు..!
అలాగే సంస్థపై ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే.. కొత్త అంశాలను నేర్చుకుంటామన్నారు. ఆర్బీఐ నూతన ఆవిష్కరణల కోసం కృషి చేస్తామని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పుంజుకుంటున్న వేళ.. ముడిచమురు ధరల పెరుగులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ జీడీపీలో రుణాల నిష్పత్తి ఎక్కువగా ఉండటంతో.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం ఉండొచ్చన్నారు. 2023లో అత్యల్ప ఒడిదుడుకులను చూసిన రూపాయి.. మిగతా నూతన కరెన్సీలతో పోల్చితే బాగానే ఉందన్నారు. సాధారణ వర్షపాతం ఆధారంగా.. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ అంచనా వేసినట్లు చెప్పారు.