Drug Addicted Son Killed his Father in Hyderabad: యువత డ్రగ్స్ కు బానిసై తమ జీవితాన్నే కాదు.. తల్లిదండ్రుల జీవితాలను కూడా నాశనం చేస్తోంది. డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపినా.. నగరంలో గుట్టుగా డ్రగ్స్ సప్లై జరుగుతూనే ఉంది. మత్తులో మునిగితేలుతున్న యువత క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. డ్రగ్స్ కు బానిసైన కొడుకుని తండ్రి మందలించడంతో.. ఆవేశంలో కన్నతండ్రినే బలిగొన్నాడు ఆ కసాయి. ఈ ఘటన ఆదిభట్ల తుర్కయాంజిల్ లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ అవెన్యూలో నివాసం ఉంటున్న అనురాగ్ తన తండ్రి రవీందర్ తో గురువారం (ఏప్రిల్ 4) సాయంత్రం గొడవకు దిగాడు. డ్రగ్స్ కు బానిసైన కొడుకును ఆయన మందలించడంతో.. దాడి చేశాడు. దాంతో రవీందర్ రోడ్డుపైకి పరుగెత్తగా.. వెంబడించిన అనురాగ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై బండరాయితో తండ్రి తలపై మోది దారుణంగా హతమార్చాడు. ఆదిభట్లలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని రవీందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేశారు.
నాగర్ కర్నూల్ వాసి అయిన రవీందర్ వృత్తిరీత్యా రియల్టర్. రెండు నెలల క్రితమే తుర్కయాంజిల్ లో కొత్త ఇల్లు కొని అక్కడే నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకైన అనురాగ్ జులాయిగా తిరుగుతూ.. డ్రగ్స్ కు బానిసవ్వగా అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించారు.
Also Read: ఆపరేషన్ గజ.. 48 గంటలు బయటకు రావొద్దన్న అధికారులు
అప్పటికీ అతనిలో మార్పు రాకపోగా.. రెండు కేసుల్లో జైలుకి కూడా వెళ్లొచ్చాడు. దాంతో పద్ధతి మార్చుకోవాలని రవీందర్ మందలించాడు. ఈ క్రమంలోనే తండ్రిపై కక్ష పెంచుకున్న అనురాగ్.. హతమార్చాలన్న ఉద్దేశంతో రెండ్రోజుల క్రితమే పెట్రోల్ కొనుగోలు చేసి ఇంట్లో ఉంచాడు. ప్లాన్ ప్రకారం తండ్రిని చంపి.. పరారయ్యాడు. పోలీసులు అనురాగ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.