Operation Gaja in Komaram Bheem District: ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా ప్రజలను మదగజం వణికిస్తోంది. గజరాజు సృష్టించిన బీభత్సానికి ఇప్పటికే ఇద్దరు రైతులు మరణించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. బూరేపల్లి, కొండపల్లి గ్రామాల్లో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మరణించారు. ఏనుగు దాడి నేపథ్యంలో ప్రజలను దాని బారి నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చింతలమానేపల్లి, పెంచికల్ పేట, బెజ్జూర్ మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. 48 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు.
గత రాత్రి (ఏప్రిల్ 4, గురువారం) కొండపల్లి మలుపు వద్ద ఒక బస్సుకు ఏనుగు ఎదురుగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెంచికల్ పేట మండలంలోని గ్రామాల్లో గజరాజు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మండలంలోని 12 గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఏనుగు దాడిలో ఎవరూ గాయపడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
Also Read: చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి?
గజరాజును సురక్షితంగా సరిహద్దు దాటించేందుకు “ఆపరేషన్ గజ” చేపట్టారు. ఇందుకోసం 70 మంది అధికారులను రంగంలోకి దించారు. రేయి పగలు తేడా లేకుండా.. రెస్క్యూ టీం ఏనుగు ఆచూకీ కోసం గాలిస్తోంది. కాగా.. ఏనుగుదాడిలో మరణించిన రైతుల కుటుంబాలకు మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.