Rajampeta TDP Ticket Issue : రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ టికెట్ ఇష్యూ ఆ పార్టీలో పెద్ద రచ్చకే దారితీస్తోంది .. పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కనపెట్టి పక్క సెగ్మెంట్కు చెందిన కొత్త అభ్యర్థిని ప్రకటించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత కాలం టికెట్ రేసులో ఫోకస్ అయిన టీడీపీ సీనియర్ నేత చెంగల్రాయుడికి మద్దతుగా రోడ్డెక్కుతున్నారు తెలుగుతమ్ముళ్లు. రాజంపేట ఎంపీ టికెట్ ఆశించి చివరికి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారైన బాలసుబ్రమణ్యంకు సహకరించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెంగల్రాయుడు. చంద్రబాబు తన నిర్ణయాణ్ని వెనక్కి తీసుకోకపోతే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాననడం హాట్టాపిక్గా మారింది.
ఉమ్మడి కడప జిల్లాలో కీలక అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట. గత ఎన్నికల్లో జిల్లాలో చావుదెబ్బ తిన్న టీడీపీ ఈ సారి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే టీడీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత రేగుతున్న అసంతృప్తి సెగలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. లోక్సభ నియోజకవర్గ కేంద్రం కూడా అయిన రాజంపేటలో చివరి వరకు పొత్తులు లెక్కలు తేలలేదు. రాజంపేట ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే అభ్యర్ధి ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారన్నది మిత్రపక్షాల ఫైనల్ లిస్ట్ వెలువడే వరకు క్లారిటీ రాలేదు.
Also Read: మూసుకుపోయిన దారులు, అవినాష్కి మరో పది రోజులేనా?
చివరికి రాజంపేట ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అక్కడ ఆ పార్టీ అభ్యర్ధిగా మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించారు. దాంతో అప్పటివరకు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఫోకస్ అయిన సుగవాసి సుబ్రహ్మణ్యంను రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిర్ణయించారు చంద్రబాబు. అయితే అప్పటి వరకు రాజంపేట టీడీపీ ఇన్చార్జ్గా పార్టీ బలోపేతానికి కృష్టి వచ్చిన చెంగల్రాయుడు టీడీపీకి షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. ఆయనను కాదని రాజంపేట అసెంబ్లీ టికెట్ను రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు చంద్రబాబు.
చివరి క్షణం వరకు తనకే టికెట్ అని భావించిన చెంగల్రాయుడు తనను కాదని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కు టికెట్ కేటాయించడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిడిపి జెండాలు దగ్ధం చేసి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు చెంగల్రాయుడు అనుచరులు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన చెంగల్రాయుడుని కాదని సుబ్రహ్మణ్యంకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు చెంగల్రాయుడు వర్గీయులు.
రాజంపేట అసెంబ్లీ టికెట్ రాజంపేట కు చెందిన నేతలకే ఇవ్వాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. రాయచోటికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కు టికెట్ కేటాయించడం పై రాజంపేట టిడిపి నేతలు ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చెంగల్రాయుడికి మద్దతుగా రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. బాలసుబ్రమణ్యం కు సహకరించే ప్రసక్తే లేదని అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి చెంగల్రాయుడు సిద్దంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
Also Read: వైసీపీకి షాక్.. ఆమంచి రాజీనామా..
2019 ఎన్నికల్లో ఇష్టంలేకపోయినా పోటీ చేసి ఎంతో నష్టపోయానని చెంగల్రాయుడు అంటున్నారు. ఈ సారి విజయం సాధిస్తానన్న ధీమాతో టికెట్ ఆశిస్తే హ్యాండ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకుని.. తనకు న్యాయం చేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తనకు రాజంపేట టికెట్ దక్కకపోతే అధిష్టానం నిర్ణయానికి కటుబడి ఉండటమా.. లేకపోతే అనుచరుల మాట ప్రకారం నడుచుకోవడమా ?నిర్ణయించుకుంటానని చెప్తున్నారు.
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రాజు మాత్రం సుగవాసి సుబ్రహ్మణ్యం అభ్యర్ధిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. అయితే ఆ దిశగా ఆయన రాజంపేట టీడీపీ క్యాడర్కి నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయిందంట. అయిదేళ్లుగా తమకు అండగా ఉంటూ వస్తున్న చెంగల్రాయుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారంట. మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే సీటు ఆశించిన జనసైనికులు కూడా తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. సీటు తమకు దక్కకపోగా.. టీడీపీ నుంచి నాన్ లోకల్ లీడర్ పోటీకి దిగడం జనసేన నేతల్ని మరింత అసహనానికి గురిచేస్తోందంట. మరి ఈ పంచాయతీని అటు చంద్రబాబునాయుడు, ఇటు రాజంపేట ఎంపీ అభ్యర్ధి మాజీ సీఎం కిరణ్లు ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.