Punjab Kings 11 Won by 3 Wickets against Gujarat Titans in IPL 2024: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. శశాంక్ సింగ్(61*), అశుతోశ్ శర్మ(31) చెలరేడంతో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది.
అంతకుముందు గిల్(89*, 48 బంతుల్లో), రాహుల్ తెవాటియా(23*, 8 బంతుల్లో) చెలరేగడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి.. పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు రెండో ఓవర్లో ఎదరుదెబ్బ తగిలింది. ఎదర్కున్న రెండో బంతికే కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో మరో ఓపెనర్ బెయిర్స్టో(22), ప్రభ్సిమ్రాన్ సింగ్(35) రెండో వికెట్కు 35 పరుగుల జోడించారు. ఈ దశలో నూర్ అహ్మద్ బెయిర్స్టో వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ తీసుకున్నాడు. తర్వాతి ఓవర్లో సామ్ కర్రన్(5) అవుట్ అవ్వడంతో పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read: SRH Won by 6 Wickets: హైదరాబాద్ వీరబాదుడు.. తేలిపోయిన చెన్నై బౌలర్లు..!
ఈ దశలో సికందర్ రాజా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ను లక్ష్యం వేపు నడిపించారు. ఈ తరుణంలో మోహిత్ శర్మ బౌలింగ్లో సికందర్ రాజా(15) పెవిలియన్ చేరాడు. మరో పక్క శశాంక్ సింగ్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన తరుణంలో జితేశ్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఆ తరువాతి బంతికి భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఇంపాక్ట్ సబ్గా వచ్చిన అశుతోశ్ శర్మ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో శశాంక్ సింగ్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి ఫోర్ కొట్టిన అశుతోశ్ గెలుపు సమీకరణాన్ని 12 బంతుల్లో 25 పరుగులకు తీసుకొచ్చాడు.
మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో అశుతోశ్ సిక్స్, శశాంక్ సిక్స్ కొట్టడంతో మొత్తంగా ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 7 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ తొలి బంతికే అశుతోశ్ శర్మ(31) భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతి వైడ్ కాగా, రెండో బంతికి పరుగురాలేదు. 3వ బంతికి ఒక్క పరుగు రాగా ఆ తర్వాత బంతికి శశాంక్ ఫోర్ కొట్టాడు. 2 బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా ఆ తర్వాత బంతికి ఒక లెగ్బై రావడంతో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగులు చేసిన సాహా రబాడా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో కేన్ విలియమ్సన్, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఒక వైపు గిల్ చెలరేగగా అతనికి విలియమ్సన్ చక్కని సహకారం అందించాడు. ఈ దశలో 26 పరుగులు చేసిన విలియమ్సన్ బ్రర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఆ తరువాత గిల్కు సాయి సుదర్శన్ తోడయ్యాడు. ఎడాపెడా బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 33 పరుగులు చేసిన సుదర్శన్ హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోవైపు గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ స్కోర్ 164 వద్ద విజయ్ శంకర్(8) రూపంలో గుజరాత్ 4వ వికెట్ కోల్పోయింది. చివర్లో రాహుల్ తెవాటియా, గిల్ ధాటిగా ఆడటంతో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.