Janasena MLA Candidates: జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చింది. తొలుత రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా యనమల భాస్కరరావు పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం సాగింది. అరవ శ్రీధర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ప్రచారం సాగిన విధంగానే జనసేనాని అభ్యర్థిని మార్చేశారు. యనమల భాస్కరరావుకు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. అరవ శ్రీధర్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారని తెలుస్తోంది. యనమల భాస్కరరావుపై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ పేరును ఖరారు చేశారు. మరొక స్థానంలో మాత్రమే జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పాలకొండ అభ్యర్థిని ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. రెండురోజుల్లో పాలకొండ అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై జనసేనాని పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. స్థానిక నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
Also Read: గ్లాస్ పగిలింది.. జనసేనకు ఈసీ బిగ్ షాక్!
ఏపీలో ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. కాకినాడ లోక్ సభ స్థానం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వల్లభనేని బాలశౌరి పేర్లను పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.