Radhakishan Police Custody news : ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో కీలకంగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీపీ రాధాకిషన్ రావును నేడు పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. నిన్ననే రాధాకిషన్ రావును 7 రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. అక్కడి నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం.. ఉస్మానియాకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిచిన అనంతరం బంజారాహిల్స్ పీఎస్ కి తరలించనున్నారు.
మరోవైపు ఈ కేసులో వేణుగోపాల్ ని 11 గంటలపాటు అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని వేణుగోపాల్ అంగీకరించారు. దీంతో.. ఆయనను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
కాగా.. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బులను పోలీస్ వాహనాల్లోనే తరలించానని రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.
Also Read : దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు ఫ్లాట్ వంతు..!
భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో ఉన్న వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు మొదట సహకరించకపోయినా.. ఆ తర్వాత విచారణలో అసలు విషయాలు చెప్పాడని తెలిపారు. ప్రణీత్ రావు చెప్పిన మేరకు మూసీవద్ద హార్డ్ డిస్క్ శకలాలను వెలికితీశారు. వాటిలో 5 ధ్వంసమవ్వగా, 9 హార్డ్ డిస్క్ ముక్కలు లభ్యమయ్యాయి. ఎస్ఐబీ కార్యాలయంలోనూ ఆధారాలను సేకరించారు. 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.