Katasani Ramireddy vs BC Janardhan Reddy : కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం రాజకీయం కొత్త రూటు పట్టింది. ఎన్నికలంటే అభ్యర్ధుల పరస్పర విమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లు సహజమే. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే పనులపై తెగ హామీలు ఇస్తుంటారు. అయితే అక్కడ టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్ధనరెడ్డి సొంత డబ్బుతో చేస్తానని కోట్ల రూపాయాల హామీలు గుప్పిస్తున్నారు. తన మాటకు కట్టుబడి ఉంటానని పదేపదే ప్రకటిస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కొడుకు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచే దమ్ముందా అని జనార్ధనరెడ్డికి సవాళ్లు విసురుతూ బనగానపల్లి రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ముందు నుంచి వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.సి.జనార్ధన్రెడ్డిల మధ్యే పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ సారి కూడా వారిద్దరే పోటీకి సిద్ధమయ్యారు. గత అయిదేళ్ల నుంచి అధికారపక్షం ఎమ్మెల్యేగా అటు పార్టీ, ఇట ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన కాటసాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు.
Also Read : విడదల ఎఫెక్ట్.. మాధవి డిఫెక్ట్.. గెలుపు స్వరం ఎటువైపు ?
వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో కాటసాని రామిరెడ్డి కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు తనను గెలుపు వైపు నడిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నా ఆయన.. తన హయాంలో స్థానికంగా ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు, సచివాలయ వ్యవస్థ, రైతులకు సాగునీటి వసతి కల్పించడం తనకు ప్లస్ అవుతాయంటున్నారు. 2009లో కాటసాని పీఆర్పీ అభ్యర్ధిగా బనగానపల్లి నుంచి గెలిచి.. తర్వాత జగన్ బాట పట్టారు. 2014లో బీసీ జనార్ధనరెడ్డి చేతిలో పరాజయం పాలై.. గత ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు.
టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు తనదేనని.. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అయిదేళ్ల నుంచి పార్టీ బలోపేతం దృష్టి పెడుతూ వచ్చిన ఆయన.. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాటసాని రామిరెడ్డిపై చర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల బనగానపల్లెలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు.
ఈ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అతని కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి భూ కబ్జా ఆరోపణలు చేశారు. అది వారిద్దరి మాటల యుద్దానికి దారితీసింది. కాటసాని తండ్రీ కొడుకులు జనార్ధనరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జెసిఆర్, జెసివిఆర్ కంపెనీ మోడల్ స్కూల్ వద్ద అక్రమ మైనింగ్ చేసిన ఘనత బీసీ జనార్దన్ రెడ్డిదని కౌంటర్ ఇచ్చారు. బీసీ జనార్ధనరెడ్డి గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కాటసాని యద్దేవా చేశారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలో వచ్చినా రాకపోయినా తమ ఆస్తులు అమి అయినా సరే పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తానని గతంలో జనార్దనరెడ్డి హామీ ఇచ్చారని.. అయితే ప్రజా గళంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని బీసీ కోరడం హాస్యాస్పందంగా ఉందని సెటైర్లు విసురుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టబడి ఉండాలని.. పేదలకు సొంత డబ్బుతో ఇళ్ల స్థలాల పంచాలని డిమాడ్ చేస్తున్నారు.
Also Read : పింఛన్ ఇవ్వండి మహాప్రభో.. ఏపీలో రాజకీయ క్రీడ
దానిపై ధీటుగానే స్పందించారు టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత డబ్బుతో పేదలకు రెండు సెంట్లు భూమి పంచుతానని మీడియా ముఖంగా స్పష్టం చేస్తున్నారు. ప్రజాగళం సభలోనూ అదే చెప్పానని.. దాన్ని వక్రీకరిస్తున్నారని కాటసానిపై ధ్వజమెత్తారు.
అదేవిధంగా 100 ఎకరాలు పేదలకు రాసిస్తానని ఎమ్మెల్యే భార్య అంటున్నారని.. అటువంటప్పుడుడు ఎమ్మెల్యే పేదవాడు ఎలా అవుతారని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రామిరెడ్డిని పేదవాడు అని సంబోధించడం ఏంటని విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేపై పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తూ పర్సనల్గా టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి మా ఊర్లో స్కూటీపై తిరుగుకుంటూ ఉన్న నీవు నీకు ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు అని ప్రశ్నించారు. పేదలకు 100 ఎకరాలు రాసి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం సొంత డబ్బు 60 కోట్లతో ఇంటి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని సవాల్ విసిరారు. అలా కోట్ల లెక్కలు మాట్లాడుతూనే.. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలిచే దమ్ముందా అని సవాల్ విసిరారు.
మొత్తమ్మీద కోట్ల రూపాయల స్థలాల పంపకాలకు మేము సిద్దం అంటే మేము సిద్దం అంటున్న ప్రధాన పార్టీ అభ్యర్ధులు ఇప్పుడు నియోజకవర్గం వాసుల చర్చల్లో నలుగుతున్నారు. ఇద్దరు నేతలు ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.