Two Farmers Died in Elephant Attack in Komuram Bheem District: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించి 24 గంటల వ్యవధిలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. చింతలమానేపల్లి మండలం.. బూరేపల్లిలో ఒకరిని, పెంచికల్ పేట మండలం కొండపల్లిలో మరో రైతుపై ఏనుగు దాడిచేసి అక్కడికక్కడే చంపేసింది. ఈ వరుస ఘటనలతో భీతిల్లిన రైతులు ఏనుగును బంధించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఇద్దరు రైతుల ప్రాణాలు బలిగొన్న ఏనుగును పట్టి బంధించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లోని వ్యవసాయ భూములను పోలీసులు, అటవీ అధికారుల జల్లెడ పడుతున్నారు.
మహారాష్ట్ర నుండి దారితప్పి వచ్చిన ఏనుగు.. తొలుత బూరేపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి అకస్మాత్తుగా చొరబడింది. ఆ సమయంలో మిరపతోటలో 55 ఏళ్ల శంకర్ భార్య సుగుణబాయి, మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నాడు. ఏనుగు రాకను గమనించిన సుగుణబాయి భర్తతోపాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరుగెత్తింది. తోట నుంచి బయటికి రాలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. ఏనుగు నేరుగా అక్కడికే వచ్చి అతడిని తొండంతో పైకెత్తి నేలకేసి కొట్టింది. అనంతరం అతడిని కాలితో తొక్కుతూ విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..
కౌటాల సీఐ సాదిక్ పాషా, ఖర్జెల్లి రేంజ్ అధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి ఏనుగు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దాడి చేసిన అనంతరం అది గంగాపూర్ నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మీదుగా ఖర్జెల్లి వైపు వెళ్ళినట్టు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున అది కొండపల్లిలోని వ్యవసాయ భూముల్లో పనిచేసుకుంటున్న మరోరైతు పోచయ్యపై దాడిచేసి హతమార్చినట్టు సమాచారంతో అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఏనుగుదాడిలో మరణించిన రైతు కుటుంబాలకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఏనుగుదాడిలో ఇరువురు రైతులు మరణించడంపట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎక్స్ గ్రేషియా తక్షణం అందించే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.