Rains Alert to Telangana State: మండుటెండలు మాడు పగలగొడుతున్నాయి. ఉదయం 9 గంటలైనా కాకుండా.. సూరీడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. గడప దాటి అడుగు బయటపెట్టాలంటే హడలిపోయే పరిస్థితి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విపరీతమైన ఉక్కపోత, సాయంత్రమైనా చల్లబడని వాతావరణంతో నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో.. మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలోనని ప్రజలు భయపడుతున్నారు.
మరోవైపు ఇటీవలే ఐఎండీ మూడు నెలల వరకూ మాడు పగిలే ఎండలు కాస్తాయని హెచ్చరించింది. తాజాగా.. తెలంగాణ వాసులకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వేసవితాపం నుంచి రాష్ట్ర ప్రజలు కాస్త ఉపశమనం లభించనుంది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, 7,8 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.
Also Read: Hyderabad Crime : డ్రగ్స్ కు బానిసై.. తండ్రిని తగలబెట్టిన కసాయి కొడుకు
బుధవారం (ఏప్రిల్ 3) ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. గురువారం నుంచి మరో ఐదురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. జూన్ నెల చివరి వరకూ ఎల్ నినో ప్రభావం ఉండనుండటంతో.. ఈ వేసవి ప్రజలకు కష్టకాలమే.