AAP : గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన కంచన్.. బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సూరత్ తూర్పు నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కన్పించట్లేదని బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. నామినేషన్ పత్రాల పరిశీలన కోసం కంచన్ మంగళవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ నాయకులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీనే కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు.
కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. కంచన్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.