Phone Tapping Case Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ4గా ఉన్న మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుకు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. దీంతో పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్రావును గురువారం నుంచి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1 గా చేర్చిన పోలీసులు, మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావును ఏ4గా చేర్చారు. కాగా రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు. భవ్య సిమెంట్స్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు రూ. 70 లక్షలు సీజ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇక దుబ్బాక ఉపఎన్నిక సమయంలో బీజేపీ నేత రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ. కోటి సీజ్ చేశామని విచారణలో రాధాకిషన్రావు అంగీకరించారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ టీమ్ ఆగడాలివే.. ఇవిగో ఆధారాలు..
అటు మునుగోడు బైపోల్ సమయంలో కాంగ్రెస్ నేత, ప్రస్థుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి రూ. 3.50 కోట్లు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. దీంతో అతన్ని విచారిస్తే మరికొందరి పేర్లు, అప్పటి ప్రభుత్వంలో భాగమున్న నేతలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.