Kona Venkat: రచయిత కోన వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు కథలను, మాటలను అందించింది ఆయనే. కోన వెంకట్ కథలు అందించిన సినిమాల్లో అదుర్స్ ఒకటి. ఎన్టీఆర్, నయనతార, షీలా హీరో హీరోయిన్స్ గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్.
వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ టాప్ 10 బెస్ట్ ఫిల్మ్స్ లో అదుర్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్- బ్రహ్మీ కామెడీ ట్రాక్ కు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెల్సిందే.
తాజాగా అదుర్స్ సీక్వెల్ గురించి కోన వెంకట్ స్పందించాడు. ప్రస్తుతం ఆయన కథ అందించి, నిర్మించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో అదుర్స్ సీక్వెల్ పై ఆయన మాట్లాడారు. “నాకు అదుర్స్ సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. అదుర్స్ 2 చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే.. ఆయన ఇంటిముందు పిలక వేసుకొని కూర్చొని నిరాహార దీక్ష చేసైనా ఆయనను ఒప్పిస్తాను. చారి లాంటి పాత్ర ఎన్టీఆర్ తప్ప చేసేవారు ఇండస్ట్రీలోనే లేరు. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్ను ఎన్టీఆర్లాగా చేసే వారు ఇండియాలోనే ఎవరు లేరు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అదుర్స్ 2 పై ఎన్టీఆర్ ఏమనుకుంటున్నాడో చూడాలి.