Krishna Funerals : మంగళవారం పరమపదించిన సూపర్స్టార్ కృష్ణ అంత్యక్రియలు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పద్మాలయా స్టూడియోకి వచ్చారు. నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కృష్ణగారి సినిమా కెరీర్ పరిశీలిస్తే ఎన్నో సాహసాలకు, ప్రయోగాలకు కృష్ణగారు మారు పేరు. చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు చేశారు. మొదటి కౌబాయ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 ఎం.ఎం, మొదటి డి.టి.ఎస్ సౌండ్ సిస్టమ్ మూవీ వంటి సాంకేతిక పరంగా చాలా సినిమాలు చేశారు. అలాగే పద్మాలయా స్టూడియోను స్థాపించి నిర్మాతగా మహత్తర సినిమాలను నిర్మించారు. సాంఘిక, జానపద, చారిత్రాత్మక .. ఇలా అన్నీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం దక్కించుకున్నారు. సంకల్పంతో ముందుకు నడిచారు. నిర్మాతల పాలిట కల్ప తరువుగా నిలిచారు.
నాన్నగారి తర్వాత కృష్ణగారే ఇండస్ట్రీకి బంగారు గుడ్లు పెట్టే బాతులుగా నిర్మాతలకు అండగా నిలిచారు. చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. నేను కృష్ణగారితో కలిసి సుల్తాన్ సినిమాకు పని చేశాను. ఆ సమయంలో ఎప్పుడూ ఆయన నాన్నగారి గురించే చెబుతుండేవారు. నిర్మాతలకు నాన్నగారైతేనేమి, కృష్ణగారైతేనేమి స్ఫూర్తిగా నిలిచారు. కృష్ణగారి సేవలను గుర్తించి ఎన్నో అవార్డులను ఇచ్చారు. 350 పైచిలుకు చిత్రాల్లో నటించారు. కృష్ణగారు కారణజన్ముడు. ఆయన ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా దుర్ఘటనలు సంభవించాయి. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. కృష్ణగారిలాంటి వ్యక్తులను జీవితాంతం మరచిపోలేం. వారి చేసిన సినిమాలు, వారి వ్యక్తిత్వం, కళామతల్లికి చేసిన సేవలు శాశ్వతం’’ అన్నారు.