Phone Tapping Case Updates(Latest news in telangana): ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ మేరకు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో పోలీసులు వివరాలు వెల్లడించారు. ప్రణీత్ రావు మొదట సహకరించకపోయినప్పటికీ.. తర్వాత వివరాలు వెల్లడించారన్నారు.
హార్డ్ డిస్కులను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావును నాగోల్ మూసీ వద్దకు తీసుకెళ్లి హార్డ్ డిస్క్లను వెలికితీసే చర్యలు చేపట్టి ఎట్టకేలకు హార్డ్ డిస్క్ శకలాలు వెలికితీశారు. మూసీలో 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేసులు, మెషీన్తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మూసీలో 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో SIB కార్యాలయంలోనూ పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. 12 కంప్యూటర్లు, 7 CPUలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడితో పాటు SIB కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. SIB కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులు సేకరించారు.
Also Read: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం.. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
మరోవైపు SIB కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలంను నమోదు చేశారు. అయితే, ప్రతిపక్షాల అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు SIB కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు.