Janasena MLA, MP Candidates(Political news in AP): జనసేనలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా సరైన నాయకులు లేరు. గుర్తింపు ఉన్న నేతలు తక్కువ మందే. ప్రజలకు ముఖ పరిచయమున్న నేతలు మరీ తక్కువ. అలాంటిది ఉన్న కొద్ది మందిలో మొదట్నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నేతల కంటే.. ఇతర పార్టీల్లోంచి వచ్చినవారికే టికెట్లు ఇస్తుండటం జనసేన నాయకుల్ని తీవ్ర కలవారుపాటుకు గురి చేస్తోంది. టీడీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకుని మరీ పవన్ కల్యాణ్ టికెట్లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేన నేతలకు మింగుడు పడటం లేదు.
జనసేన నుంచి టికెట్లు ఇచ్చిన వారిలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయరాజ్ జనసేనలో చేరారు. ఆయనకు పాలకొండ సీటు దక్కే అవకాశం ఉంది. గతంలో టీడీపీ పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా దిగబోతున్నారు.
భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ కూడా నిన్నటి వరకు టీడీపీ నేతలే. అలాగే టీడీపీ నేత అరవ శ్రీధర్ జనసేనలో చేరి రైల్వే కోడూరు సీటు కోరుతున్నారు. ఇప్పటికే భాస్కర్ రావుకు సీటు ఇచ్చినప్పటికీ మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: జనసేనలో అవనిగడ్డ అగ్గి.. బుద్ధప్రసాద్ చేరికపై ఆగ్రహ జ్వాలలు..
అటు వైసీపీ నుంచి వచ్చినవారికి కూడా పవన్ పెద్ద పీటే వేశారు. బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్నవారికి టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకుని టికెట్లు ఇవ్వడమేంటంటూ జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.