Mumbai Indians Captain Hardik Pandya Blames Himself for Team’s Defeat To RR:
ఐపీఎల్ లో ఏ మ్యాచ్ లపై లేనంత హై ఓల్టేజ్ ముంబై ఇండియన్స్ పై నడుస్తోంది. కెప్టెన్ గా వచ్చిన హార్దిక్ పాండ్యా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అటు గ్రౌండులో వేలాదిమంది అభిమానులతో, ఇటు జట్టుతో, అటు తర్వాత ఫ్రాంచైజీలతో, ఇటు వైపు గ్రౌండ్ లో ప్రత్యర్థులతో నాలుగువైపుల నుంచి పోరాడి పోరాడి అలసిపోతున్నాడు.
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ పై ఘోరంగా ఓడిపోయిన సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ ఈ ఓటమికి తనదే బాధ్యతని అన్నాడు. మా జట్టులో అందరూ సమర్థవంతులైన ఆటగాళ్లున్నారు. వాళ్లని సరైన దిశలో నడిపించలేకపోయానని అన్నాడు. ఐపీఎల్ రేస్ లో నిలవాలంటే ఇంకా క్రమశిక్షణగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకూడదని, ఆటలో ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందని అన్నాడు.
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడోమ్యాచ్ లో కూడా ఓటమి పాలైంది. రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ఒక దశలో ముంబై ఇండియన్స్ విలవిల్లాడింది. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Also Read: రాజస్థాన్ రాజసం.. ముంబై హ్యాట్రిక్..
హార్దిక్ పాండ్యా ఏమంటాడంటే, నేను మ్యాచ్ లో కొంచెం త్వరగా బ్యాటింగ్ కి వచ్చాను. అయితే మరికొంత సేపు ఆడి ఉండాల్సిందని అన్నాడు. టాప్ ఆర్డర్ అంతా వెనుతిరిగనప్పుడు నేను సంయమనంతో ఆడి ఉండాల్సిందని అన్నాడు. 34 పరుగులు మాత్రమే చేశానని తెలిపాడు.
అంతేకాకుండా మ్యాచ్ కు ముందు సరికొత్త వ్యూహాన్ని అమలు చేశాం. మొదటి బాల్ నుంచి ఎటాక్ చేయాలని అనుకున్నాం. అలా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం సాధిద్దామని అనుకున్నాం. కానీ వాళ్లు బాగా బౌలింగ్ చేశారని అన్నాడు. ప్రతి ఒక్కరూ హిట్టింగ్ కి వెళ్లడం వల్ల త్వరగా అవుట్ అయిపోయారని అన్నాడు.
మ్యాచ్ లో మా బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారని అన్నాడు. తొలి నుంచి త్వరత్వరగా వికెట్లు తీశారు. అయితే తక్కువ స్కోరు కావడంతో మ్యాచ్ కాపాడుకోలేక పోయామని అన్నాడు.