Union Finance Ministry Clarifies on New Income Tax Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఆదాయ పన్ను విధానంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయని వస్తున్న వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. కొత్త ఆదాయ పన్ను(ఐటీ) విధానంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఐటీ విధానంలో మార్పులు వస్తాయన్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇందులో నిజం లేదని తేల్చి చెప్పింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై సోమవారం ఆర్థిక శాఖ స్పందించింది.
నిజానికి 2023-24 గత ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త ఆదాయ పన్ను విధానంలో చేసిన సవరణలు అమల్లోకి వచ్చాయి. అయితే దీని మదింపు సంవత్సరాన్ని 2024-25గా పరిగణిస్తారు. అయితే కొందరు ఈ విషయం తెలియక.. దీన్నే కొత్త ఆర్థిక సంవత్సరంగా పొరబడి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి ముదింపుగా 2025-26ను పరిగణిస్తారు.
202-24 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం.. రూ.3 లక్షలలోపు వ్యక్తుల వార్షిక ఆదాయం ఉంటే.. అటువంటి వారికి ఎటువంటి పన్నులు ఉండవని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రూ.3 నుంచి 6 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉంటే 5 శాతం, రూ.6-9 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.9-12 లక్షలకు 15 శాతం, రూ.12-15 లక్షలు ఉంటే 20 శాతం చొప్పున పన్ను ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.15 లక్షలు దాటితే అలాంటి వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: New Rule of PF : పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాబ్లమ్ ఉండదట..
అయితే వ్యక్తిగత ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కొత్త, పాత పన్ను విధానాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డీఫాల్ట్ గా కొత్త విధానాన్నే సిస్టమ్ పరిగణలోకి తీసుకుంటుంది. కొత్త పన్ను విధానంలో భాగంగా వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం గతంలో వెల్లడించింది.