Summer: మార్చి నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాలపై చూపిస్తున్నాడు. తాజాగా భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి బయపడిపోతున్నారు. అయితే భానుడి ప్రతాపం మరికొన్ని రోజులు కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోనున్నాయని.. కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించింది. పగటి సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.