YS Sharmila vs YS Avinash Reddy Contest In Kadapa(AP election updates): వైఎస్ వర్సెస్ వైఎస్. ఆశ్చర్యంగా అనిపించినా.. కడప ఎంపీ స్థానంలో ఇదే జరగబోతుంది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన తమ్ముడు అవినాష్రెడ్డిపై.. APCC చీఫ్ YS షర్మిల పోటీ చేయనున్నారు. వివేకా హత్య కేసులో అటు పోలీసులతో పాటు సొంత కుటుంబీకుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ను రాజకీయంగా చిత్తు చేసే వ్యూహంలో భాగంగానే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కడప గడపలో విజయం ఎవరదేనే చర్చ తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గత ఎన్నికల తర్వాత అసలు జెండా మోసే వారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు గాను ఇప్పటికే అభ్యర్ధులుగా ఎవర్ని నిలబెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్ధుల్ని కూడా దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో ఆసక్తి పరిణామం చోటు చేసుకోనుంది. కడప గడపలో YSR కుటుంబ సభ్యుల మధ్య అసలు సిసలైన పోటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ తరపున కడప అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపేరును ప్రకటించారు జగన్. ఆయనకు ప్రత్యర్ధిగా.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఏపీసీసీ చీఫ్ YS షర్మిలను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ హైకమాండ్. దీంతో అక్కా తమ్ముడి మధ్య పోరు రసవత్తరంగా మరనుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాయలసీమలో.. అదీ.. గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత వైసీపీపై ఆరోపణలు వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో చిక్కుకోవడంతో .. గెలుస్తాడా లేదా అనే డైలమా ఉంది. దీనికి తోడు వివేకా కుమార్తె సునీత… హంతకులకు ఓటేయవద్దని కోరడం మరింత ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.
దీనికి కొనసాగింపుగానే కడప ఎంపీగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగుతుండటంతో.. వైసీపీకి గట్టి దెబ్బ తగలడమే కాదు.. అక్క చేతిలో తమ్ముడు చిత్తు అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ అధిష్టానం మేరకే తాను పోటీలో ఉంటున్నట్లు షర్మిల ప్రకటించారు.
తొలి జాబితాలోనే కడప పార్లమెంటుకు షర్మిల పేరు ఖరారు కావటంతో ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. నాలుగు దశాబ్దాలుగా కడప ఎంపీ స్థానంలో YS కుటుంబం బరిలో ఉంది. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు అవినాష్ రెడ్డి వైసీపీ తరుపున ఎంపీగా గెలిచారు. మూడోసారి బరిలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యరీతిలో అవినాష్ రెడ్డిపై పోటీకి షర్మిల సై అంటున్నారు. దీంతో YS వర్సెస్ YS అనే నినాదం తెరపైకి వచ్చింది.
అవినాష్ రెడ్డి లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఆమె టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. DL రవీంద్రా రెడ్డి, వీరశివారెడ్డి, అహ్మదుల్లా వంటి సీనియర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల. ఇటీవల వివేకా వర్థంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం పేరిట భారీ సభను సునీతతో కలసి షర్మిల నిర్వహించారు. మరోవైపు.. తెర వెనుక షర్మిలకు టీడీపీ సీనియర్లు మద్దతు ఇస్తున్నారనే వార్తలూ గుప్పుముంటున్నాయి.
జగన్, అవినాష్ లక్ష్యంగా కడప జిల్లాలో నేతలంతా ఏకమవుతున్నారు. కాంగ్రెస్ నేతలను యాక్టివ్ చేయటం సహా వైసీపీలో ఉన్న పలువురు ద్వితీయ శ్రేణి నేతలతో రహస్యంగా షర్మిల చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా కడప జిల్లాపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. వివేకా హత్య.. కుటుంబసభ్యులు చేసి హత్యే అని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యంగా షర్మిల ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
Also Read: రాజు గారి పంతం..! తగ్గేనా..? నెగ్గేనా..?
అవినాష్ రెడ్డి కేంద్రంగా ఈసారి రాజకీయం సాగనుందని విశ్లేషకులు అంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్రపై ఇటీవలే జగన్ స్పష్టత ఇచ్చారు. ఓ రకంగా అవినాష్కు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు. అవినాష్ ప్రచారం కూడా ప్రారంభించేశారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న అవినాష్.. అసంతృప్తి నేతలతో ఎక్కువగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టి.. విజయాన్ని జగన్కు బహుమతిగా ఇవ్వాలని ఆయన పట్టుదలగా ఉన్నారని టాక్. 2017 స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివేకానంద పోటీ చేశారు. కానీ ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత ఆయన హత్యకు గురికావటం.. దాని వెనుక అవినాష్ హ్యాండ్ ఉందని స్వయంగా కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్న నేపథ్యంలో.. కడపలో గెలుపు.. ఏపీ అంతటా ఉత్కంఠగా మారింది.