Extreme Heat Waves Alert in India: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా మార్చి నెలలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఈ తరుణంలో భారత వాతరవరణ శాఖ పలు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. దేశవ్యాప్తంగా మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెలలో ఎక్కువ హీట్ వేవ్స్ కొనసాగే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పశ్చిమ మధ్యప్రదేశ్ లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. మొత్తం 23 రాష్ట్రాల్లో వేడిగాలులు కారణంగా ఎలాంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఐఎండీ పేర్కొంది.
మధ్య భారతదేశం, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో రానున్న మూడు నెలల్లో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని మహాపాత్ర తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తాయన్నారు. ఏప్రిల్ లో దేశంలోని గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
Also Read: JEE Main Admit Cards : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
ముఖ్యంగా మధ్య దక్షిణ భారదేశంలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రానున్న రెండు నుంచి ఎనిమిది రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, వడగాల్పులు నేపథ్యంలో.. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పగటి పూట బయటకు రాకపోవడం మంచిదని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పవర్ గ్రిడ్, రవాణా వ్యవస్థలు మౌళిక సదుపాయాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని.. ఈ మేరకు అటుంవంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐఎండీ కోరింది.