Bhatti Vikramarka Comments On KCR(Political news in telangana): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సూర్యాపేట పర్యటనలో గులాబీ బాస్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇలా దిగజారి మాట్లాడతారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరుతుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు. మైక్ సమస్యను పవర్ కట్స్ అంటూ చెప్పడంపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమాలను భట్టి విక్రమార్క ప్రస్తావించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను బొగ్గు లభించే ప్రాంతానికి దూరంగా నిర్మించారని తెలిపారు. 350 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల బొగ్గ సరఫరాకు భారీగా వ్యయం అవుతోందని వివరించారు. ఇదంతా అదనపు ఖర్చే కదా అని ప్రశ్నించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు ఆలస్యంగా వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం అలసత్వం వల్లే వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు. అందువల్లే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిందని వివరించారు.
ఏపీ విభజన చట్టంలో విద్యుత్ పై పొందుపర్చిన అంశాలను భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని ఆ చట్టలో ఉందని స్పష్టం చేశారు. ఆ చట్టం ప్రకారమే తెలంగాణకు ఎన్టీపీసీ మంజూరు అయ్యిందని తెలిపారు. భద్రాద్రి ప్లాంట్ ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సి ఉన్నా కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టారని తెలిపారు.