Congress: కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ముందు పన్ను నోటీసులపై కాంగ్రెస్ పై ఎటువంటి చర్యలకు పాల్పడమని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను కూడా జులై కు వాయిదా వేయమని ఐటీ శాఖ కోర్టును కోరింది.
ఐటీ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు రూ.3,500 కోట్లకు పన్ను డిమాండ్ నోటిసులకు సంబంధించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి బలవంతపు చర్యలకు పాల్పడమని సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ నోటిసులపై కాంగ్రెస్ పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని జులై 24వ తేదీకి వాయిదా వేసింది.
పన్ను డిమాండ్ల నోటీసులకు గాను కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీపై బలవంతపు చర్యలకు దిగబోం అని కోర్టులో తుషార్ మెహతా తెలిపారు. అయితే ఈ కేసులో తమకు ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ తరఫు నేత వివేక్ తంఖా ఆరోపించారు.
Also Read: Gyanvapi Mosque: జ్ఞానవాపీ ప్రాంగణంలో హిందూ పూజలు.. కొనసాగింపునకు సుప్రీం అనుమతి..
2017-2018 నుంచి 2020-2021 అసెస్ మెంట్ సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపింది. దీంతో పాటుగా ఆదివారం రూ.1,744 కోట్లు కట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరో నోటీసును పంపింది.