Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో పలు విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్ తన మంత్రి వర్గంలోని ఇద్దరు పేర్లను వెల్లడించినట్లు ఈడీ తెలిపింది. నిందితుడు విజయ్ నాయర్ తో వారే చర్చలు జరిపేవారని కేజ్రీవాల్ ఈడీ అధికారులకు తెలిపారు. అయితే కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు వెల్లడించారు. కేజ్రీవాల్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం తేదని ఆయన కోర్టులో ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ విచారణను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారి పేర్కొన్నారు.
ఈడీ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ తన మంత్రి వర్గంలోని మంత్రులైన ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ పేర్లను వెల్లడించారు. నిందితుడైన విజయ్ నాయర్ ప్రతి విషయాన్ని తన మంత్రి వర్గంలోని వారికి మాత్రమే రిపోర్టు చేసేవాడని కేజ్రీవాల్ ఈడీ అధికారుల ఎదుట తెలియజేశారు. అయితే మద్యం కేసులో ఈవెంట్స్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ సీఈవో విజయ్ నాయర్ ను ఈ కేసులో 2022లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే విజయ్ నాయర్ గత కొంత కాలంగా ఆప్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.
ఈ కేజ్రీవాల్ వెల్లడించిన ఈ విషయాలన్నీ ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టులో తెలిపారు. అయితే ఈడీ అధికారులు కేజ్రీవాల్ తెలిపిన విషయాలను కోర్టులో వెల్లడిస్తున్న సమయంలో ఆ ఇద్దరు మంత్రులు కోర్టు రూమ్ లోనే ఉన్నారు. కోర్టులో ఈడీ వాదనలు ముగిసిన అనంతరం వారిద్దరూ అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అయితే గతంలో ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా కూడా తన విచారణ సమయంలో ఈడీ ఎదుట ఆతిశీ పేరును ప్రస్తావించారు. గోవాలో ఆప్ పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జిగా ఆమె పనిచేసినట్లుగా గుప్తా వెల్లడించారు.
Also Read: Uttarpradesh Crime : అనుమాన భూతం.. భార్య, పిల్లల్ని చంపి.. మూడురోజులుగా..?
కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో కొన్ని అభ్యర్థనలు చేశారు. తనకు జైలులో చదువుకునేందుకు మూడు పుస్తకాలు కావాలని కోరారు. రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. వీటితో పాటుగా తనకి జైలులో ఓ బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం, ప్రస్తుతం తాను మెడలో ఉన్న లాకెట్ ను కొనసాగించడానికి కోర్టులో ఆయన అనుమతి కోరారు.