Nizam College : నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చింది. డిగ్రీ విద్యార్థులకు 100శాతం హాస్టల్ వసతి కల్పించేందుకు సర్కార్ అంగీకరించింది. కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా డిగ్రీ విద్యార్థులకే కేటాయిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. హాస్టల్ వసతి కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ హాస్టల్ ఉంటే.. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. పేద విద్యార్థులకు ఇది ఆర్దికంగా భారం పడుతోంది. దీంతో తమకు కాలేజీలోనే హాస్టల్ వసతి కల్పించాలని.. నూతనంగా నిర్మించే బిల్డింగ్ను తమకు కేటాయించాలని విద్యార్థులకు ఆందోళనకు దిగారు. గత 20రోజులుగా అలుపెరగని పోరాటం చేశారు. విద్యార్థుల ధర్నాలు, ర్యాలీలతో పలుమార్లు కాలేజ్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు. ఐనా విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సర్కార్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పోరాటం కంటీన్యూ చేస్తామని భీష్మించుకుని కూర్చుకున్నారు. విద్యార్థుల పోరాటం ఉధృతం కావడంతో మంత్రి కేసీఆర్ చొరవ చూపించారు. సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రికి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. దీంతో సమస్యపై దృష్టి సారించిన విద్యాశాఖ తొలుత హాస్టల్ లో 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయించింది. దీనిపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనను కొనసాగించారు.
నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనకు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థుల నిరసనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. విద్యార్ధులకు హాస్టల్స్ కేటాయించాలని మంగళవారం ఏబీవీపీ కార్యకర్తలు బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 20 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు మండిపడ్డారు.
నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతం అవుతుండడంతో.. ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్తో పాటు కళాశాల విద్యార్థినులతో మంత్రి సబిత సమావేశం అయ్యారు. నిబంధనలకు అనుగుణంగా 100శాతం వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. సర్కార్ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు.