Delhi Capitals vs Chennai Super Kings: విశాఖపట్నం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి విజయం. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 పరుగులతో ఓటమి చవిచూసింది.
రహానే(45, 30 బంతుల్లో), డేరిల్ మిచెల్(34, 26 బంతుల్లో), ధోనీ(37, 16 బంతుల్లో, 4X4, 3X6) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చివర్లో మహేంద్రుడు మునుపటి ధోనీని గుర్తుచేశాడు. కావాల్సిన పరుగులు భారీగా ఉండటంతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకి ఇదే తొలి ఓటమి.
అంతకుముందు రిషబ్ పంత్(51, 32 బంతుల్లో), డేవిడ్ వార్నర్ (52, 35 బంతుల్లో), పృథ్వీ షా(43, 27 బంతుల్లో), చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. మూడో ఓవర్లో మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. వీరిద్దరిని ఖలీల్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు.
ఆ తరువాత రహానే, డేరిల్ మిచెల్ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు. 68 పరుగులు జోడించిన తర్వాత ఈ జంటను అక్షర్ పటేల్ విడదీశాడు. 34 పరుగులు చేసిన మిచెల్ అక్షర్ పటేల్ బౌలింగ్లో తనకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
15వ ఓవర్లో రహానేను ముకేశ్ కుమార్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే సమీర్ రిజ్విను అవుట్ చేసి చెన్నైను కష్టాల్లోకి నెట్టాడు. గత మ్యాచ్ హీరో శివమ్ దూబే ఇంపాక్ట్ సబ్గా వచ్చి 18 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత ధోనీ ఎంట్రీ ఇవ్వడంతో వైజాగ్ స్టేడియం హోరెత్తిపోయింది. బౌండరీతో ఖాతా ప్రారంభించాడు మహేంద్రుడు. చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 46 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో 19వ ఓవర్ బౌలింగ్ చేసిన ముకేశ్ కుమార్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఒవర్లో 41 పరుగులు కావాల్సి ఉండటంతో ఢిల్లీ గెలుపు లాంఛనమైంది. కానీ ధోనీ చివరి ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 9.3 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ముస్తాఫిజుర్ బౌలింగ్లో పతిరాణ అందుకున్న అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఓవర్లో పృథ్వీ షా 43 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
Also Read: GT vs SRH: రాణించిన సాయి సుదర్శన్.. టైటాన్స్ ఘనవిజయం..
ఆ తరువాత మిచెల్ మార్ష్, పంత్ కొద్దిసేపు ఆచితూచి ఆడారు. కానీ పతిరాణ ఒకే ఓవర్లో మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్ వికెట్లు తీసి ఢిల్లీని వెన్నువిరిచాడు. దీంతో దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఇన్నింగ్స్కు బ్రేక్ పడ్డట్టు అయ్యింది.
చివర్లో రిషబ్ పంత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో వరుసగా 6,4,4 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత బాల్కి భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు. మొత్తంగా 19వ ఓవర్లో 17 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో 12 పరుగులు రావడంతో 191 పరుగులు చేసింది.