LK advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ పీఎం ఎల్ కే అద్వానీకి భారత రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. ఆయన ఇంటికి వెళ్లి ఈ పురస్కారం అందించారు.
ఎల్కే అద్వాణీ 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించారు. ఆయన 14 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్లో చేరారు. 20 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ కరాచీ వింగ్ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో లా విద్యను అభ్యసించారు. భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత.. అద్వానీ కుటుంబం ముంబై వలస వచ్చింది.
అద్వానీ రాజస్థాన్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ వ్యవహరించారు. 1957లో ఢిల్లీలో జన్సంఘ్ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి 1967లో కౌన్సిల్ ఛైర్మన్ పదవి చేపట్టారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. అయోధ్య రథయాత్ర చేపట్టిన దేశవ్యాప్తంగా అద్వాణీ పేరు సంపాదించారు.
Also Read: పీవీ భారతరత్న అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు..
అద్వానీ 1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1976లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1977-79 మధ్య కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1980లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న కలిసి భారతీయ జనతా పార్టీని అద్వానీ ఏర్పాటు చేశారు. 1982లో మూడోసారి రాజ్యసభకు వెళ్లారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచి పార్టీగా నిలిచింది. వాజ్పేయీ ప్రధాని అయ్యారు. కానీ 13 రోజులకే ఈ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత 1999లో బీజేపీ మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1999 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి అద్వానీ ఎంపీగా గెలిచారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అద్వానీ ప్రతినేతగా వ్యవహరించారు. 2014లో గాంధీనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019 నుంచి అద్వానీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.