KTR On Metro : మెట్రో రైలు విస్తరణకు ఆర్థికసాయం అందించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిప్రీత్ సింగ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రెండో దశ కింద నిర్మించబోయే బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్-2 విస్తరణ పనులకు రూ. 8, 453కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. మొదటి దశ కింద 69 కిలోమీటర్ల నిర్మించిన మెట్రో విజయవంతంగా నడుస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు.
రెండో దశలో మొత్తం 31కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఇందులో 23 స్టేషన్లు నిర్మిస్తారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5కిలోమీటర్లు విస్తరిస్తారు. ఈ మార్గంలో కొత్తగా 4 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
మరోవైపు మెట్రో రైలు చార్జీలు 25 నుంచి 30 శాతం పెంచుతారని వార్తలు వస్తున్నాయి. పెరిగిన టికెట్ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీకి ఈ– మెయిల్ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు ముగిసింది. ఇప్పటికే ప్రజల నుంచి సూచనలు, సలహాలు అందాయి. టిక్కెట్ రేటు ఎంత పెరుగుతుందో కొన్ని రోజుల్లో క్లారీటీ వచ్చే అవకాశం ఉంది.