CM Revanth Reddy Strategies For Lok Sabha: అష్టదిగ్బంధనం.. కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగలకు విపక్షాలు బేజారవుతున్నాయి. ఓ వైపు చేరికలు.. మరోవైపు ప్రజాకర్షక పథకాలు ..అటు జనంతో మమేకమవుతూ.. విపక్షాల వెన్ను విరుస్తూ జనంలోకి దూసుకుపోతుంది కాంగ్రెస్.. ఇంతకీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలా సమాయత్తమవుతోంది? ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ తెరలేపిన సరికొత్త రాజకీయమేంటి?
రేవంత్ రెడ్డి.. ఇంట్రడక్షన్ అవసరం లేని ఓ ఐకాన్.. కాకలు తీరిన కేసీఆర్ను మట్టికరిపించి తెలంగాణ పాలన పగ్గాలు అందుకున్న నేత.. విపక్షంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను నేలకు దించిన రేవంత్.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. అందులోనూ పీసీసీ చీఫ్ కూడా ఆయనే.. మరి ఆయన ఆధ్వర్యంలో జరుగబోయే లోక్సభ ఎన్నికలు ప్రిపరేషన్ అంటే మాములు విషయం కాదు కదా.. మాములుగానే రేవంత్ ఓ వ్యూహంతో పనిచేస్తారు. సూటిగా నేరుగా.. కుండబద్ధలు కొట్టినట్టుండే ఆయన మాటలు.. ప్రసంగాలను అస్సలు లైట్ తీసుకోవడానికి లేదని ఇప్పటికే ఆయన చేతలను బట్టి అర్థమైపోతుంది. ఆయన ఈ మధ్య కాలంలో పదే పదే చెబుతున్న మాట. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో గెలవడం ఖాయమని.. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వ్యూహాలతో ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ టార్గెట్.. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడం . మరి ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి?
పార్టీని బలపరచాలి.. ప్రత్యర్థిని దెబ్బతీయాలి. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి.. ఇప్పుడీవన్నీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఓ వైపు చేరికలతో పార్టీని బలపరుస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే.. జనాన్ని ఆకర్షించడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. మరోవైపు విపక్షాన్ని వీక్ చేయడంలోనూ డబుల్ సక్సెస్ అయ్యింది. విపక్షాన్ని వీక్ చేయడానికి కాంగ్రెస్ పెద్దగా ఏం కష్టపడలేదు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోవడంతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన ఒక్కో స్కామ్ను వెలుగులోకి వస్తుంటే.. ఒక్కో లీడర్.. కేసీఆర్కు గుడ్బై చెప్పేస్తున్నారు. అహంకారంతో ప్రజలకు దూరమైన బీఆర్ఎస్.. ఇప్పుడు ఆ పార్టీ లీడర్లకూ దూరమవుతోంది.
Also Read: కూటమిలో కంగాళి మారకపోతే నష్టమే!
మూడు నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపించిన మాటలు ఇవి.. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో.. అందులో కొందరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే విషయాన్ని ముందే చెప్పారు సీఎం రేవంత్.. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని.. ఆయన అలా అన్నారో లేదో.. ఇన్నాళ్లు ఉగ్గబట్టుకొని కూర్చున్న బీఆర్ఎస్ నేతలు. కారు దిగారు.. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.. ఇంకా కప్పుకుంటున్నారు..
బీఆర్ఎస్ పరిస్థితి ఎంతకి దిగజారిందంటే.. ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి వచ్చింది. టికెట్లు దక్కించుకున్న వారు కూడా మాకొద్దని వెనక్కి ఇచ్చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకున్న కడియం కావ్య పార్టీకి రాజీనామా చేశారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ వద్దని కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. మల్కాజ్గిరి నుంచి బరిలోకి తన కొడుకే అని తొడకొట్టిన మల్లారెడ్డి.. సైలెంట్గా సైడ్ అయిపోయారు. బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో పెద్దదిక్కుగా వ్యవహరించిన కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. దానం ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణలో నామినేషన్లు మొదల్యయే సరికి గ్రేటర్లో కారు ఖాళీ అవుతుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఇది తెలంగాణలో విపక్ష పార్టీ పరిస్థితి.. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పోటీలోకి దిగకముందే. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఉంది. ఆ పార్టీ క్యాడర్లోనే కాదు.. నాయకత్వంలోనూ రోజు రోజుకూ జోష్ తగ్గుతోంది..
వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు సీఎం రేవంత్రెడ్డికి ఇష్టం లేదు పద్ధతిగా ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే దాన్నే చేయాలన్నది ఆయన పాలసీ.. కానీ, ప్రభుత్వం కూల్చేస్తామంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు వరుసగా చేయడం.. ఆర్నెళ్లలో మళ్లీ తానే సీఎం అవుతానంటూ కేసీఆరే, పార్టీ నేతలతో చెప్పడం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ నేతలు మాట్లాడడం.. రేవంత్ రెడ్డి ఆలోచనను మార్చాయంటారు. అంతేకాదు.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రేవంత్ సర్కార్ కూల్చే కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెళ్లకు మించి ఉండదంటూ ఒకే టోన్లో రెండు పార్టీలు చెప్పడం కూడా తెరవెనుక ములాఖత్పై అనుమానాలు పెంచింది. అందుకే.. కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. ప్రత్యర్థికి అలాంటి అవకాశమే లేకుండా చేయాలనుకుంది.
అదే సమయంలో కాంగ్రెస్లో చేరతామంటూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు సంప్రదిస్తుండడం, హైకమాండ్ నుంచి వచ్చిన ఒత్తిడి చేరికల విషయంలో రేవంత్రెడ్డి మనసు మార్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. షెడ్యూల్ విడుదలైన రోజే ఆ విషయాన్ని రేవంత్రెడ్డే స్వయంగా చెప్పేసారు. అందుకే, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం కారు ఖాళీ కావడం మొదలయ్యింది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది.
Also Read: కారులో కేకే కుదుపు! కారణాలివేనా?
అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి..
చెప్పినట్టుగానే ఐదు గ్యారెంటీలను అమలు చేశారు. మరో గ్యారెంటీ అమలుకు కూడా రంగం సిద్ధం చేసేలోపే.. ఎన్నికల నగారా మోగడంతో ఆలస్యమైంది. లేదంటే అది కూడా అమలయ్యేదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. మరోవైపు ప్రజల్లో రేవంత్ సర్కార్పై నమ్మకం పెరిగింది. రేవంత్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం వచ్చింది. మరోవైపు ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం కాకుండా.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోయారు. అందరికి సమాన ప్రాతినిధ్యం కల్పించారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ప్రజలను మనసులను గెలుచుకుంది కాంగ్రెస్..
అదే సమయంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. చేరికలను ప్రొత్సహిస్తూనే.. నేతలు జనంలోకి వెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో విజయభేరి పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభకు సోనియా, రాహుల్, ఖర్గే హాజరయ్యారు.. అదే ప్లేస్లో మరోసారి సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. ఈసారి ఏప్రిల్ ఆరున జనజాతర పేరుతో సభను నిర్వహించేందుకు రెడీ అయ్యింది. మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతోంది. లక్షలాది మంది ప్రజలను తరలించి కాంగ్రెస్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు హస్తం నేతలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అన్న సీన్ నుంచి.. తెలంగాణలో కాంగ్రెస్ అంటే పవర్ఫుల్ పార్టీ అనే రేంజ్కు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేసిన రేవంత్ రెడ్డి.. లోక్సభ ఎన్నికల సమయానికి అసలు కేసీఆర్కు ఎత్తులు వేసే చాన్స్ కూడా ఇవ్వడం లేదు.. రేవంత్రెడ్డి ఇదే దూకుడు చూపిస్తే.. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ చిత్తవడం ఖాయమన్న వాదనా వినిపిస్తోంది.