TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను మీడియాకు, రాజకీయనాయకులు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను ఈనెల 29న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొలుగోలు చేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీపై కేసులు నమోదయ్యాయి. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇవ్వజూపినట్లు అభియోగాలు నమోదు చేశారు. అక్టోబర్ 26న మొయినాబాద్లోని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్ కేంద్రంగా ఈ వ్యవహారం నడించింది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సీట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్హెచ్వో లక్ష్మీరెడ్డిను నియమించింది.
ఈ కేసు దర్యాప్తును సిట్ కొనసాగిస్తోంది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ను సిట్ అధికారులు 2 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఎఫ్ఎస్ఎల్లో నిందితుల వాయిస్ రికార్డు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది.