Telangana New Medical Colleges : మెడికల్ చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ఇదో శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీలను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఒకనాడు మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాలుగా అవస్థలు పడ్డామన్నారు. స్వరాష్ట్రంలో నేడు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.. ఆత్మగౌరవంతో బతుకుతూ.. దేశానికే మార్గదర్శకంగా నిలిచామన్నారు. ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం అన్నారు సీఎం కేసీఆర్.
ఏపీ విభజన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం ఐదు మాత్రమే. దీంతో మెడికల్ చదవాలనుకునే విద్యార్థులకు సీటు దొరకడం కష్టతరంగా ఉండేది. ప్రైవేటులో మెడికల్ సీటు కొనాలంటే.. పేదల విద్యార్థులకు తలకు మించిన భారంగా ఉండేది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత కొత్తగా నాలుగు మెడికల్ కళాశాలను స్థాపించింది.
మహబూబ్నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో వీటిని నిర్మించారు. ఇప్పుడు కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు కేసీఆర్. కొత్త వాటిని కలిపితే.. ప్రస్తుతం తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరింది.
తెలంగాణలో గతంలో 850 మెడికల్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 2790 సీట్లకు పెరిగాయన్నారు సీఎం కేసీఆర్. గతంతో పోల్చితే ఇప్పుడు నాలుగు రేట్లు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయన్నారు. సొంతరాష్ట్రం ఏర్పాటుతోనే ఇవన్నీ సాధ్యం అయ్యాయన్నారు కేసీఆర్. రానున్న రోజుల్లో 33 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు పెడతామని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు పెడతామన్నారు.
వైద్య సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. మంత్రి హరీశ్రావు వైద్యారోగ్యశాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరపమైందని కేసీఆర్ కొనియాడారు. దళిత, గిరిజన, బడుగు బలహీన బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఇదో మంచి అవకాశం అన్నారు కేసీఆర్.