T20 వరల్డ్కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓటమితో బాధపడుతున్న కోట్లాది అభిమానులకు కాస్త ఊరట దక్కింది. T20 వరల్డ్ కప్ నెగ్గకపోయినా… T20ల్లో టీమిండియా నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. ICC తాజాగా విడుదల చేసిన T20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది.
T20 వరల్డ్ కప్ లో కొన్నాళ్లుగా టీమిండియాదే టాప్ ప్లేస్. ఆ పొజిషన్ ను T20 వరల్డ్ కప్ తర్వాత కూడా నిలబెట్టుకుంది… భారత జట్టు. T20 టీమ్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 268 పాయింట్స్తో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలవగా… T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ కు 265 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్కప్ ముందు వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పాయింట్ల గ్యాప్ చాలా ఉన్నా… వరల్డ్కప్ గెలుపుతో ఇంగ్లండ్ టాప్ ప్లేస్ కు చేరువగా వచ్చింది. కానీ… 3 పాయింట్లు తక్కువ కావడంతో… రెండోస్థానానికి పరిమితమైంది. T20ల్లో ఇంగ్లండ్ దూకుడు ఇకపైనా కొనసాగితే… అగ్రస్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇక వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కూడా పాయింట్లను బాగా మెరుగుపరుచుని మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు పాక్ ఖాతాలో 258 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత సౌతాఫ్రికా 256, న్యూజిలాండ్ 253, ఆస్ట్రేలియా 252, వెస్టిండీస్ 236, శ్రీలంక 235, బంగ్లాదేశ్ 222, ఆఫ్ఘనిస్తాన్ 217 పాయింట్లతో… వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక T20 బ్యాటర్ల విషయానికొస్తే.. సూర్యకుమార్, మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే తొలి మూడు స్థానాల్లో ఉండగా, బౌలింగ్లో హసరంగ, రషీద్ ఖాన్, హేజిల్వుడ్ టాప్-3 పొజిషన్లో ఉన్నారు. ఇక ఆల్రౌండర్లలో షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, హార్ధిక్ పాండ్యా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.