Sania Mirza contesting Elections 2024 from Hyderabad: సార్వత్రిక ఎన్నికల వేడి తెలంగాణకు బాగానే తాకింది. టికెట్ల ఎంపికలో పార్టీ నేతలు జాగ్రత్తగా వ్యవహరి స్తున్నారు. తాజాగా కాంగ్రెస్ తరపున సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ముఖ్యంగా తెలంగాణలోని అభ్యర్థులపై ప్రముఖంగా ఫోకస్ చేశారు. టికెట్ రేసులో ఇద్దరు ముగ్గురు నేతలు ఉండడం తో సర్వేలను దగ్గర పెట్టి ఎంపిక చేస్తున్నారు నేతలు.
తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియామీర్జాను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఓకే అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఆమె పేరును మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన చేశారని అంటున్నారు. సానియామీర్జా ఇమేజ్ కూడా కలిసివస్తుందని నేతల ఆలోచన. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు సానియాతో చర్చించినట్టు పొలిటికల్ టాక్.
ఈ సీటు నుంచి బీజేపీ తరపున డాక్టర్ మాధవీలత బరిలో ఉన్నారు. ఆమెకు ధీటుగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. సానియామీర్జా గురించి చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఆమెకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలో ఆమె సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.
Also Read: AP Politics small twist: ఏపీలో కూటమి మధ్య చిన్న ట్విస్ట్.. నెంబర్స్ తేడా ఎందుకు?
2003 నుంచి క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా సానియా సోదరి అనంమీర్జా.. కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కోడలు కూడా. ఇక ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ బరిలో ఉంటున్నారు. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురుకానుంది. బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్యాదవ్ బరిలో ఉన్నారు. మరి చతుర్ముఖ పోటీలో గెలుపు ఎవరిదో చూడాలి.